Wednesday 14 October 2015

::కిటికీ::

వర్చువల్‌ 'రాజధాని'

               ''ఏందిరా వెంకట్రావ్‌.?! ఆకాశంలో హెలికేప్టర్లు అటు ఇటు తెగ ఎగిరిపోతా వున్నారు..?! మన ఊళ్ళోనేమో.. ఎర్రబుగ్గ కార్లు.. ఒకటే కురు..కురు..అంటూ తిరిగేస్తున్నరు.. ఏంటీ..ఇషయం?'' అంటూ తలకున్న తలపాగ ఊడదీసి స్టయిల్‌గా నడుముకి కట్టుకున్నాడు ఉద్దండపాలెం వీరాస్వామి. ''ఏందిరోరు.. ఒకటే ఎటకారమాడమాక.. అదేదో నీకు తెలుసన్న సంగతి మాకు తెలుసులేవోరు..'' అంటూ ఉరిమే కళ్ళతో చూశాడు వెంకట్రావ్‌. ''పర్‌ సపోజ్‌ నాకా విషయం తెలిసే అనుకో.. అసలు నీకేం తెలుసో చెప్పొచ్చుగా..'' అన్నాడు వీరాస్వామి. ''ఓరోరి ఈ మధ్య నీకు గీర బాగా ఎక్కువైందిరోరు.. సరేగానీ సీఎంగోరు ఉప్పాడ పంచె, చీరా సారే పంపారా?! పంపితే అవన్నీ సింగారించుకుని బయలుదేరు మరి. ఇక్కడ లంక పొగాకు చుట్ట కాలుత్తూ ఆకాశంలో సూత్తు గాల్లో తిరిగే హెలికాప్టర్లు లెక్కపెట్టుకోవడం ఎందుకూ? అదేదో తెలియనట్టు నాటకమాడ్డం ఎందుకు?'' ఒకింత కోపంతోనే అన్నాడు వెంకట్రావ్‌.
అలా అనగానే బావురమన్నంత పనిచేశాడు వీరాస్వామి. ''ఏందిరా వీరస్వామి ఇప్పటిదాకా.. ఆరడుగుల బుల్లెట్టులెక్క కనబడ్డోడివి ఉన్నపళంగా ఆముదం తాగినోడిలా నీరసపడి పోయావేందిరా?!'' జాలితో అడిగాడు వెంకట్రావ్‌. ''ఒరేరు.. సీఎం ఇట్టా అడిగాడో లేదో.. అట్టా ఎనకా ముందు ఆలోచించకుండా.. అమరావతి దగ్గర్లోవున్న నా రెండెకరాల భూమిని ఇచ్చేశానా లేదా..?!'' అంటుండగానే ''లక్షలొస్తాయని ఇచ్చావ్‌.. ఊరికే ఇచ్చావా? ఏంది?'' అని వెంకట్రావ్‌ అడిగేసరికి ''ఆ.. ఎవ్వరైనా ఊరికే ఇస్తారేంది? నాలుగు రూపాయలొస్తాయనే కదా ఇచ్చేది..'' అంటూ ధీర్ఘం తీశాడు వీరాస్వామి. ''మరెంకెందుకు ఏడుపు?'' అని వ్యంగ్యంగా అడగ్గానే ''భూములిచ్చిన రైతులకి పట్టుపంచె ధోవతి, చీరసారే ఇంటికి పంపిస్తానని ఆ మధ్య ప్రెస్‌మీట్లో సీఎం చెప్పాడా లేదా? వాటికోసం ఎదురుచూసి కళ్ళు కాయలు కాస్తున్నాగానీ ఇప్పటిదాకా వర్తమానం రానే రాలేదు. రైతులపేర్లు శిలాఫలకాలపైన చెక్కిస్తానని చెప్పినాడా లేదా? మరి నా పేరు ఎక్కడ ఏ నాపరాయి మీద చెక్కిస్తున్నారో చెప్పనే లేదు. మరి ఏడుపుకాక ఏమొచ్చేది..?'' అంటూ మరోసారి బావురుమన్నాడు వీరాస్వామి.
ఎలా ఓదార్చాలో తెలియక అక్కడ నుంచి డింగ్‌మంటూ వెళ్లిపోయాడు వెంకట్రావ్‌. ''నమస్కారం వీరాస్వామిగారు! రాజధాని శంకుస్థాపనకు సతీసమేతంగా విచ్చేసి, మమ్మల్ని ఆనందింపచేయ ప్రార్థన'' అంటూ ఎవరైనా గవర్నమెంటోళ్ళు ప్రేమగా పిలుస్తారనే ఆశతో వస్తానన్న బంధువుల రాక కోసం ఎదుచూసినట్లు చూస్తూనే ఉన్నాడు పాపం ఉద్దండపాలెం వీరాస్వామి. పైన ఆకాశంలో హెలికాప్టర్లు, రాజధాని గ్రామాల చేను, చెలకల మధ్య వీఐపీ కార్లు ఊపిరాడకుండా ఇంకా తిరుగుతానే ఉన్నాయి.
***
''ఇందుమూలంగా తెలియజేయునది ఏమనగా సంస్కృతి సంబరాలు, ఆటపాటలు అదిరిపోవాలి. సభా ప్రాంగణమంతా తిరుపతి నుంచి వచ్చే వేలాది పండితుల వేదమంత్రాల ఘోషతో మారుమోగాలి. వీఐపీల స్వాగతాలు ''నభూతో నభవిష్యతి'' అన్నట్టుగా సాగాలి. అది చూసి 'అచ్చంగా ఇది హిందూత్వ బడిలానే ఉందే' అని పీఎం మోడీ గంతులేయాలి. మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కుళ్ళుకుని చావాలి. హాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌, శాండల్‌వుడ్‌.. వీలైతే తెలంగాణావుడ్‌ నుంచి వచ్చే సినిమావోళ్ళు, పెట్టుబడులు పెట్టే బడా వ్యాపారులు ''వహ్వా... వహ్వా.. వారెవ్వా..'' అని పొగిడి పారేయాలి. అయినవాళ్ళకు వీఐపీ సూట్లు, కానివాళ్ళకు ప్రొక్లెయినర్లతో దున్నేసిన చేలల్లో గుడారాలు ఏర్పాటు చేయాలి. తినడానికి ఈవెంట్‌ సంస్థలు అందించే ఖరీదైన ఆహారపొట్లాలు, కాచి వడబోసిన కిన్లే వాటర్‌ బాటిళ్ళు పంచిపెట్టాలి. కార్యక్రమం ఆసాంతం రక్తికట్టించడానికి యాంకరమ్మల హోరు.. ఇంకా ఇంకా.. ఏర్పాట్లు అదిరిపోవాలెహా.! ఇదిగో ఖర్చుకి వెనకాడమాకండి. పది కోట్లా.. నలబై కోట్లా.. పోనీ వంద కోట్లా... ఎందుకులే పిసినారితనం. అప్పుచేసి పప్పుకూడు తినడం, పెట్టడం మనకు తెలిసిందే కదా.. 400 కోట్లు రౌండ్‌ ఫిగర్‌.. ఒకేనా?! రాజధాని శంకుస్థాపన కోసం అయ్యే ఖర్చు 400 కోట్లు రాసుకోండి సాంబ..!!
***
''లగ్గమెప్పుడ్రా మామా అంటే సంకురాతిరి పొయ్యేదాకా.. మంచిరోజే లేదన్నాడే.. ఆగేదెట్టాక అందాక ఏగేదెట్టాగా'' అన్నట్టుంది మన బాబుగారి వరుస..'' అంటూ నిట్టూర్చాడు రంగయ్య. ''అరె రంగయ్యా..! ఎప్పుడూ లేంది మన సీఎంగోరి మీద సెటైర్లు వేస్తున్నవేందిరా..? ఏమైనా పార్టీ మారినావా ఏంది?'' అడిగాడు సోముడు. ''నిజం మాట్టాడ్డానికి పార్టీనే మారాలా ఏంది? అయినా పార్టీ మారడానికి ఇంకా టైముందిలే'' అనేసరికి ''అసలు ఏందిరా నీవరస.. ఇసయం చెప్పకుండా పెద్ద వేదాంతిలా మాట్లాడుతున్నావ్‌?'' మళ్ళీ రెట్టించి అడిగాడు సోముడు. ''అదే మరి.. నీకు ఈ రెండు మాటలు మాట్లాడినందుకే తిక్క తిక్కగా ఉంది కదా..?! బాబుగారు చేసేపనికి నాకెట్టా తిక్క రేగాలా?'' అంటు రుసరుసలాడాడు రంగయ్య. ''రాజధాని శంకుస్థాపనకు 400 కోట్లు ఖర్చు పెడతన్నాడంట..! అదేగా నీ కుళ్ళు..?'' అని రంగయ్య కోపానికి మరింత ఆజ్యం పోశాడు సోముడు. ''ఎవరైనా ఇటుక ఇటుక పేర్చి ఇల్లు కట్టి.. ఆ ఇల్లు కట్టాక.. సంతోషంతో నలుగురికి భోజనాలు పెడతారుగానీ.. ఇదిగో అమరావతి.. అదిగదిగో సింగపూర్‌.. అల్లదిగో జపాన్‌.. అంటూ ఆలూ, చూలూ లేకుండానే శంకుస్థాపన కోసం 400 కోట్ల రూపాయలు మంచినీళ్ళలా ఖర్చుపెట్టేయడం ఎందుకంటా..?'' ఎదురుగా సిఎం ఉన్నట్లు, ఆయన్ని నిగ్గదీసినట్లు ప్రశ్నించాడు రంగయ్య.
***
400 కోట్లా.?! సోముడి బుర్రలోని కాలుక్యులేటర్‌ ఏవో లెక్కలు కడుతోంది. అంత డబ్బుతో ఎన్ని గ్రామాల్లో వాటర్‌ ట్యాంకులు కట్టొచ్చు? ఎన్నెన్ని గుంతల రోడ్లను బాగు చేయొచ్చు. ఇంకెన్ని ప్రభుత్వాసుపత్రుల్లోని సమస్యల్ని తీర్చొచ్చు? ఎన్ని గవర్నమెంటోళ్ళ బడుల్లో టారులెట్స్‌ నిర్మించొచ్చు? అంతెందుకు ప్రస్తుతం తాత్కాలిక రాజధానిగా వున్న విజయవాడ నగరంలోని డ్రైనేజీల్లో ఏళ్ల తరబడి పూడుకుపోయిన ఎంత చెత్తను బయటకి తీయొంచొచ్చు..? ఇంకా ఇంకా చాలానే చేయొచ్చే కదా...!! ఇలా లెక్కలు సాగుతూనే ఉన్నాయి.. 'వర్చువల్‌' రాజధాని నిజమవ్వడానికి ఇంకెన్ని కోట్లు కావాలోనని..!!
-గంగాధర్ వీర్ల

No comments:

Post a Comment